వారణాసి: ఆధ్యాత్మిక నగరంగా పేరుగాంచిన వారణాసి త్వరలో దేశంలోనే రెండో పూర్తి స్థాయి శాకాహార నగరంగా గుర్తింపు పొందే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ (VMC) కీలక నిర్ణయం తీసుకుంది. నగర పరిధిలో ఉన్న మాంసం, చేపలు, కోళ్ల విక్రయ దుకాణాలను నగర శివార్లకు తరలించాలని నిర్ణయించింది.
ప్రణాళికలో భాగంగా ప్రస్తుతం నగరంలో ఉన్న సుమారు 350 నుంచి 400 వరకు మాంసం దుకాణాలను వచ్చే ఆరు నెలల్లో విడతల వారీగా, దీపావళి నాటికి నగర శివార్లకు తరలించనున్నారు.
ఈ దుకాణాలను రామ్నగర్, సుజాబాద్, గణేశ్పూర్, అవలేష్ నగర్, శివపూర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ చర్యతో వారణాసి నగర కేంద్రంలో మాంసం విక్రయాలు పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉంది.
ప్రస్తుతం గుజరాత్లోని పాలితానా ప్రపంచంలోనే పూర్తిస్థాయి శాకాహార పట్టణంగా గుర్తింపు పొందింది. అక్కడ 2014 నుంచి మాంసం, చేపలు, గుడ్ల విక్రయాలపై నిషేధం అమలులో ఉంది. తాజా నిర్ణయంతో వారణాసి కూడా అదే బాటలో నడిచి దేశంలో రెండో శాకాహార నగరంగా అవతరించనుందని అధికారులు భావిస్తున్నారు.
అధికారిక అంచనాల ప్రకారం, వారణాసి జనాభాలో సుమారు 72 శాతం హిందువులు, 27 శాతం ముస్లింలు ఉన్నారు. నగర ఆధ్యాత్మిక, సాంస్కృతిక విశిష్టతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానిక వర్గాలు పేర్కొంటున్నాయి.


0 Comments