జనగామ: జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ బేన్ షాలోం గారికి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందు నాయక్ మాట్లాడుతూ, జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కజొన్న సాగు చేసిన రైతులు ప్రస్తుతం కోతలు ప్రారంభించారని తెలిపారు. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం తీవ్ర నిర్లక్ష్యమని విమర్శించారు. ప్రైవేట్ వ్యాపారులు క్వింటాల్కు కేవలం రూ.1850 వరకు మాత్రమే ధర ఇవ్వడం వల్ల రైతులు భారీ నష్టాలు చవిచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జనగామ జిల్లా పరిధిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా యాసంగి సీజన్ ముగిసే సమయానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు రైతుల ఖాతాల్లో కిసాన్ సమ్మాన్ నిధి మరియు రైతు భరోసా నిధులను జమ చేస్తామని హామీ ఇచ్చినా అమలు చేయడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. రైతుల పెట్టుబడి సహాయం అయిన రైతు భరోసా, కిసాన్ సమ్మాన్ నిధి మొత్తాలను తక్షణమే రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని కోరారు.
జిల్లాలో యాసంగి ఎండదెబ్బ ప్రారంభమై సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని దేవాదుల ప్రాజెక్టు ద్వారా గోదావరి నది జలాలను లిఫ్టింగ్ చేసి జిల్లాలోని రిజర్వాయర్లు, చెరువులు, కుంటలను నింపి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సాగునీరు అందిస్తేనే పంటలను కాపాడగలమని పేర్కొన్నారు.
ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాపర్తి సోమయ్య, జిల్లా ఉపాధ్యక్షులు రమావత్ మీట్యా నాయక్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పోతుకనూరి ఉపేందర్, తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి అజ్మీరా సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

0 Comments