
The Mango Ripening Scam Using Chemicals!
పసుపు పచ్చగా మెరిసే మామిడి పండ్లను చూసి కొనుగోలు చేసే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నాయకుడు మేడా శ్రీనివాస్ హెచ్చరించారు. మార్కెట్లో విక్రయిస్తున్న మామిడి పండ్లలో చాలా వరకు రసాయనాలతో కృత్రిమంగా మగ్గించి రంగు మార్చినవే ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
పచ్చిగా ఉన్న మామిడి పండ్ల మధ్య ఇథిలిన్ రసాయన పేపర్లను ఉంచి వాటిని త్వరగా పండించినట్లు చూపించి, వినియోగదారులకు విక్రయించడం జరుగుతోందని తెలిపారు. ఈ విధంగా కృత్రిమంగా మగ్గించిన పండ్లు ఆరోగ్యానికి తీవ్ర హానికరమని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, ఫుడ్ సేఫ్టీ వంటి ప్రభుత్వ శాఖలు తమ బాధ్యతలను విస్మరిస్తూ, అవినీతి ముసుగులో మౌనంగా చూస్తుండటం బాధాకరమని విమర్శించారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన వ్యవస్థలు విఫలమవడం వల్ల సమాజం ప్రమాదంలో పడుతోందని అన్నారు.
మార్కెట్లో బహిరంగంగానే రసాయనాలతో మగ్గించిన పండ్ల విక్రయాలు జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడం వారి అసమర్థతకు నిదర్శనమని మండిపడ్డారు. ప్రజలకు ఉపయోగపడాల్సిన ప్రభుత్వ వ్యవస్థలు పనిచేయకపోతే, అవి ఉండటం వృథా అని తీవ్రంగా వ్యాఖ్యానించారు.
ఇంకా, ప్రధాన కార్పొరేట్ మీడియా ఈ తరహా మోసాలను పట్టించుకోకపోవడం సమాజానికి హానికరమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తేవాల్సిన మీడియా తన బాధ్యతను విస్మరిస్తే, అది సమాజానికి మరింత ప్రమాదకరంగా మారుతుందని తెలిపారు.
ఆహార కలుషితం, అవినీతి పాలన, సామాజిక భద్రత లోపం వంటి సమస్యలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజల జీవన భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే దిశగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే, అవినీతి అధికారులపై ప్రజల ఆగ్రహం వెల్లువెత్తడం ఖాయమని మేడా శ్రీనివాస్ హెచ్చరించారు.
మేడా శ్రీనివాస్ ఆవేదన
రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్
0 Comments