ఏప్రిల్ 17న బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్లో ఘనంగా ప్రదానం
పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థ ‘ఇగ్నైటెడ్ మైండ్స్’ వ్యవస్థాపకుడు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్కు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన ‘గ్లోబల్ గ్రీన్ ఐకాన్’ పురస్కారం వరించింది. ఈ అవార్డును ఏప్రిల్ 17న యునైటెడ్ కింగ్డమ్లోని బ్రిటన్ పార్లమెంట్కు చెందిన హౌస్ ఆఫ్ లార్డ్స్లో ఘనంగా ప్రదానం చేయనున్నారు.
దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచడంలో, ప్రజలను ఉద్యమం వైపు మళ్లించడంలో సంతోష్ కుమార్ చేసిన కృషి విశేషంగా గుర్తింపు పొందింది. ఆయన ప్రారంభించిన ‘హరా హై తో భరా హై’ నినాదంతో కొనసాగుతున్న ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ఉద్యమం లక్షలాది మందిని ప్రభావితం చేస్తూ, మొక్కలు నాటే సత్సంప్రదాయాన్ని దేశవ్యాప్తంగా విస్తరించింది. విద్యార్థులు, యువత, రైతులు, సామాన్య ప్రజలతో పాటు పలువురు జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై కోట్లాది మొక్కలను నాటడం విశేషం.
లండన్లో అంతర్జాతీయ కాన్క్లేవ్
పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి, వాతావరణ మార్పులపై పోరాడుతున్న నాయకులను గుర్తించి సత్కరించేందుకు బ్రిటన్కు చెందిన ‘హెలిన్ స్పార్క్ స్ట్రాటజీస్ యూకే లిమిటెడ్’ సంస్థ ఏప్రిల్ 17న లండన్లో అంతర్జాతీయ కాన్క్లేవ్ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా హౌస్ ఆఫ్ లార్డ్స్లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో సంతోష్ కుమార్కు ‘గ్లోబల్ గ్రీన్ ఐకాన్’ పురస్కారాన్ని అందజేయనున్నారు.
సమిష్టి కృషికి లభించిన గౌరవం
ఈ అవార్డు లభించడం పట్ల జోగినపల్లి సంతోష్ కుమార్ ఆనందం వ్యక్తం చేస్తూ, ఇది తన వ్యక్తిగత గౌరవం కాదని, పర్యావరణ పరిరక్షణ కోసం శ్రమిస్తున్న ప్రతి ఒక్కరి కృషికి దక్కిన గుర్తింపని పేర్కొన్నారు. ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో భాగంగా చెట్లు నాటిన ప్రతి ఒక్కరికి ఈ అవార్డు చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
కలాం ఆలోచనలతో ముందుకు
ఇదే సందర్భంగా ‘ఇగ్నైటెడ్ మైండ్స్’ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ, భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్ఫూర్తితో పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. భావితరాలకు పచ్చని, ఆరోగ్యకరమైన భూమిని అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తరించనున్నట్లు వెల్లడించారు.
0 Comments