సాహిత్యం సమాజ మార్పుకు శక్తి: వైవీబీ రాజేంద్రప్రసాద్
ఉయ్యూరు, ఏప్రిల్ 6, 2026:
రాష్ట్ర ప్రభుత్వం ప్రదానం చేసిన ఉగాది పురస్కారాన్ని సాహితీవేత్త గబ్బిటదుర్గాప్రసాద్ గారికి ఇవ్వడం ఎంతో హర్షణీయమని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ఉయ్యూరులోని శ్రీ ఆర్యవైశ్య కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో జాగృతి కో-ఆపరేటివ్ సొసైటీ మరియు సరస భారతి సంయుక్త ఆధ్వర్యంలో గబ్బిట దుర్గాప్రసాద్ గారి అభినందన సభ ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజేంద్రప్రసాద్ గారు సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ, సాహిత్యం సమాజంలో మంచి మార్పులను తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. దుర్గాప్రసాద్ గారి వంటి సాహితీవేత్తలు తమ రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ, యువతను సృజనాత్మక దిశగా నడిపిస్తున్నారని కొనియాడారు. ప్రతిభను గుర్తించి గౌరవించడం సమాజ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా గబ్బిట దుర్గాప్రసాద్ గారిని, వారి సతీమణి ప్రభావతి గారిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాలతో ఘనంగా అభినందించారు. సన్మాన పత్రం మరియు జ్ఞాపికలను రాజేంద్రప్రసాద్ గారు అందజేశారు.
సాహిత్యం మనిషి ఆలోచనలను మెరుగుపరచడమే కాకుండా సమాజంలో చైతన్యం, విలువలను పెంపొందిస్తూ మంచి మార్పుకు దారితీసే శక్తిగా నిలుస్తుందని రాజేంద్రప్రసాద్ గారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి జీవి పూర్ణచంద్, ఆంధ్రప్రదేశ్ తెలుగు రచయితల సంఘం కార్యదర్శి చలపాక ప్రకాష్, సాహితీవేత్త దండిబొట్ల దత్తాత్రేయ శర్మ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని జాగృతి కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షురాలు పామర్తి రాజీవి, సీఈఓ గబ్బిట వెంకటరమణ, నాగలక్ష్మి, మహేశ్వరి పర్యవేక్షించారు.

.jpeg)
0 Comments