సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో స్కానింగ్ సేవలు పరిమిత సంఖ్యలో మాత్రమే అందుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోజుకు 40 లోపు మాత్రమే స్కానింగ్లు నిర్వహిస్తున్నారని రోగులు వాపోతున్నారు. దీంతో మిగతా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
స్కానింగ్ కోసం వచ్చిన రోగులకు “తెల్లవారుజామునే రావాలి” అని సంబంధిత సిబ్బంది సూచిస్తున్నారని సమాచారం. కానీ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు ఇది సాధ్యంకాక, చాలామంది నిరాశతో వెనుదిరుగుతున్నారు. చివరకు చేసేది లేక ప్రైవేటు స్కానింగ్ సెంటర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ఈ పరిస్థితిని అదునుగా చేసుకొని ప్రైవేటు స్కానింగ్ కేంద్రాలు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నాయని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో తగిన సౌకర్యాలు లేకపోవడం వల్ల ప్రజలపై అనవసర ఆర్థిక భారం పడుతోంది.
విభాగంలో హెచ్వోడీలు (Head of the Department) సరైన మానిటరింగ్ చేయకపోవడం వల్ల సీనియర్ రెసిడెంట్ డాక్టర్లపై అధిక పని భారం పడుతోందని తెలుస్తోంది. దీనివల్ల సేవల నిర్వహణలో లోపాలు తలెత్తుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి.
మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత రేడియాలజిస్ట్లు స్కానింగ్ సేవలు అందించడం లేదని సమాచారం. తిరిగి ఉదయం 10:30 గంటల సమయంలో మాత్రమే సేవలు ప్రారంభమవుతున్నాయని తెలుస్తోంది. అంటే రోజుకు ఒకటి రెండు గంటలపాటు మాత్రమే రేడియాలజిస్ట్ పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
అత్యవసర పరిస్థితుల్లో కూడా స్కానింగ్ అవసరం ఉంటే రోగులు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. ఆసుపత్రిలో ఐదుగురు డాక్టర్లు ఉన్నప్పటికీ, స్కానింగ్ సేవలు సమర్థవంతంగా అందడం లేదని రోగులు అంటున్నారు.
ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం తక్షణమే జోక్యం చేసుకొని పరిస్థితిని సమీక్షించాలని ప్రజలు కోరుతున్నారు. రేడియాలజీ విభాగంలో అదనపు డాక్టర్లను నియమించి, పర్యవేక్షణను కట్టుదిట్టం చేసి, రోగులకు నిరంతర సేవలు అందేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రజలపై ఆర్థిక భారం పడకుండా, ప్రధాన ఆరోగ్య సమస్యలకు తక్షణ పరిష్కారం లభించేలా సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Scanning Crisis at Suryapet Government Hospital – Limited to Only 40 Per Day

0 Comments