అమరావతి, ఫిబ్రవరి 27:
రాష్ట్రంలో అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేసి మహిళా–శిశు సంక్షేమాన్ని మెరుగుపరచడం ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఏపీ అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ, మహిళా శిశు సంక్షేమ శాఖ పనితీరు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోందని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సుపోషణ్ అభియాన్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానాన్ని సాధించిందని మంత్రి వెల్లడించారు. ఈ విజయానికి అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేసిన కృషే కారణమని ఆమె అభినందించారు.
రాష్ట్రంలోని 20 జిల్లాల నుంచి మొత్తం 76 గ్రామ పంచాయతీలు జాతీయ స్థాయి అవార్డులకు ఎంపికయ్యాయి. వాటిలో తూర్పుగోదావరి జిల్లాకు అత్యధికంగా 11 పంచాయతీలు ఎంపిక కాగా, ఎన్టీఆర్ మరియు తిరుపతి జిల్లాలకు ఒక్కొక్కటి మాత్రమే అవార్డు దక్కినట్లు తెలిపారు. ఎంపికైన ప్రతి పంచాయతీకి రూ. 1 లక్ష నగదు బహుమతి అందజేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.
ఈ నిధులను పారదర్శకంగా వినియోగించేందుకు స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించినట్లు తెలిపారు. అందులో రూ.50 వేలు అంగన్వాడీ పోషణ కార్యక్రమాలకు, రూ.25 వేలు అంగన్వాడీ ఆయాలకు, మిగతా రూ.25 వేలు కమ్యూనిటీ ఆర్గనైజేషన్ కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు వివరించారు.
అదేవిధంగా, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల హాజరు శాతం గణనీయంగా పెరిగిందని మంత్రి తెలిపారు. గతంలో 70 శాతంగా ఉన్న హాజరు ప్రస్తుతం 96 శాతానికి చేరుకోవడం ప్రభుత్వ చర్యల ఫలితమని చెప్పారు. పోషకాహారం, ఆరోగ్య తనిఖీలు, తల్లులకు అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించడం వల్ల ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని ఆమె వివరించారు.
అంగన్వాడీ వ్యవస్థను మరింత సాంకేతికంగా, పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. మహిళలు, చిన్నారుల ఆరోగ్యం మరియు పోషణలో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని ఆమె పేర్కొన్నారు.

0 Comments