హైదరాబాద్, మార్చి 11:
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఈనెల మార్చి 14 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఏప్రిల్ 16 వరకు కొనసాగనున్నాయి. పరీక్షల సమీపంతో విద్యార్థులు ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నారు. పరీక్షల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
ఇప్పటికే విద్యార్థుల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. విద్యార్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్తో పాటు మీ సేవ కేంద్రాల ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం కల్పించారు. అదేవిధంగా 8096958096 వాట్సాప్ నంబర్ ద్వారా కూడా హాల్ టికెట్లు పొందే అవకాశం ఉంది.
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,28,239 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 5,17,727 మంది రెగ్యులర్ విద్యార్థులు ఉన్నారు.
-
ప్రభుత్వ పాఠశాలల నుంచి 2,07,573 మంది
-
గురుకుల విద్యాసంస్థల నుంచి 60,139 మంది
-
ప్రైవేట్ మరియు ఎయిడెడ్ పాఠశాలల నుంచి 2,50,015 మంది పరీక్షలు రాయనున్నారు.
పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించబడతాయి. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు సులభంగా చేరుకునేలా హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ ముద్రించారు. ఈ కోడ్ను మొబైల్ ఫోన్తో స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రానికి వెళ్లే రూట్ మ్యాప్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది.
పరీక్షల నిర్వహణలో పారదర్శకత కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పరీక్ష పేపర్ను సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే ఓపెన్ చేసే విధంగా ఏర్పాట్లు చేశారు.
ఈ సందర్భంగా విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా విద్యార్థులకు సందేశం ఇస్తూ, భయపడకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు. అలాగే పాఠశాల విద్య డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ మాట్లాడుతూ, పదో తరగతి పరీక్షలు విద్యార్థుల జీవితంలో ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తాయని తెలిపారు. పాఠ్యాంశాలను బాగా చదివి అర్థం చేసుకుంటే పరీక్షల్లో సమాధానాలు సులభంగా గుర్తుకు వస్తాయని ఆయన సూచించారు.
విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా సమయపాలనతో పరీక్షలకు సిద్ధమై మంచి ఫలితాలు సాధించాలని అధికారులు ఆకాంక్షించారు.
Class 10 public exams begin from March 14 – 5.28 lakh students appear across the state

0 Comments